ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు... రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

  • కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం, బూనేటి చాణక్య ఆస్తుల జప్తు
  • డిస్టిలరీల నుంచి 15 నుంచి 20 శాతం ముడుపులు వసూలు చేశారని ఆరోపణ
  • పారదర్శక విధానాన్ని మార్చి మాన్యువల్ విధానంతో అక్రమాలు
  • 'సిగ్నల్' వంటి యాప్స్ ద్వారా రహస్య సంభాషణలు నడిపిన సిండికేట్
 ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర నిందితులకు చెందిన రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు శుక్రవారం ఈడీ అధికారికంగా ప్రకటించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులను జప్తు చేశారు.

ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. జప్తు చేసిన ఆస్తుల్లో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులకు చెందిన బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. ఏపీలో 2019కి ముందు మద్యం వ్యాపారం పారదర్శకంగా, డిజిటల్ ట్రాకింగ్‌తో జరిగేదని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కావాలనే ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చిందని ఈడీ పేర్కొంది. ఈ కొత్త విధానం ద్వారా అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టి, తమకు నచ్చిన బ్రాండ్లకు అనుకూలంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది.

ఆర్డర్లు ఇవ్వాలంటే 15 నుంచి 20 శాతం ముడుపులు ఇవ్వాలని డిస్టిలరీలను సిండికేట్ సభ్యులు డిమాండ్ చేశారని, నిరాకరించిన వారి చెల్లింపులు నిలిపివేశారని ఈడీ ఆరోపించింది. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.3,500 నుంచి రూ.4,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. వసూలు చేసిన ముడుపులను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాచిపెట్టి, అక్కడి నుంచి తరలించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులు 'సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా సంభాషణలు జరిపారని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది.



KC Reddy Rajasekhar Reddy
Andhra Pradesh liquor scam
liquor scam
Enforcement Directorate
ED
money laundering
PMLA
excise policy
corruption
illegal liquor

More Telugu News